భలే మంచి బేరం !

20 Nov, 2023 00:06 IST|Sakshi

●పార్టీల కండువాలు, చొక్కాలు, టోపీలకు గిరాకీ.. ●ఎన్నికల వేళ జోరుగా సాగుతున్న అమ్మకాలు

సత్తుపల్లిరూరల్‌: ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యాన వివిధ వృత్తుల్లో ఉన్న వారికి ఉపాధి లభిస్తోంది. ఇదే సమయాన వ్యాపారులకూ గిరాకీ పెరిగింది. ఎన్నికల సమయంలో ఒక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంకో పార్టీలో చేరడం, తెల్లారికల్లా సొంత గూటికి చేరడం సర్వసాధారణమైపోయింది. దీంతో వీరికి కప్పే పార్టీల కండువాల అమ్మకాలు జోరుగా సాగుతోంది. అంతేకాకుండా ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు కండువాలు, టోపీలు, చొక్కాలను పార్టీ నాయకులే సమకూరుస్తుండడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీల సభల సమయంలోనూ సత్తా చాటాలే హాజరైన వారందరూ పార్టీ రంగు చొక్కా ధరించాలని నాయకులు సూచిస్తున్నారు. ఇందులో కొందరికి నాయకులే వీటిని సమకూరుస్తుండగా.. మరికొందరు సొంతంగా కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వ్యాపార సంస్థల్లో ఎన్నికల సందడి నెలకొనడంతో వ్యాపారులు సంబరపడిపోతున్నారు.

మరిన్ని వార్తలు