పెనమలూరు: పోరంకిలో నిర్వహించిన మినీ జాబ్మేళాలలో నిరుద్యోగులైన యువతను వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. పోరంకి శ్రీనివాసానగర్లో హ్యాపీ మైండ్స్ సెంటర్లో మంగళవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్తంగా మినీ జాబ్మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి వివిధ కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. మొత్తం 54 మందికి ప్రాథమిక ఇంటర్వ్యూలు నిర్వహించగా, 23 మంది తదుపరి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారన్నారు. జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్బాబు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాబ్మేళాలో యువత పాల్గొని ప్రతిభ చూపితే మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో ఎన్సీఎస్ యంగ్ ప్రొఫెషనల్ జయరాజ్, ఏపీఎస్ఎస్డీసీ జిల్లా నియామక కార్యనిర్వహక అధికారి తుర్లపాటి మధురావు, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ సుజిత్, వివిధ కంపెనీలు హెచ్ఆర్లు, యువత పాల్గొన్నారు.