TS Crime News: 'కన‍్న' కలలు ఆవిరి చేసి వెళ్లిపోయావా తల్లి..! తీవ్ర విషాదం..!

26 Aug, 2023 09:32 IST|Sakshi

మహబూబాబాద్‌: తల్లి కడుపు నొప్పితో బాధపడుతుండగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కూతురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం మండలంలోని నారాయణపురంలో జరిగింది. గ్రామానికి చెందిన బిచ్చాల నర్సింహులు కుమార్తె శ్రావణి (21) బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటి వద్దే ఉంటోంది.

ఇదిలా ఉండగా నర్సింహులు భార్య కవిత ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. రెండు రోజులుగా నొప్పి ఎక్కువ కావడంతో నర్సింహులు మందలించాడు. దీనికి మనస్తాపం చెందిన శ్రావణి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కూతురు ఇంట్లో లేదని గమనించిన కుటుంబీకులు వెతకగా ఉరివేసుకుని వేలాడుతూ కొనఊపీరితో కనిపించింది.

వెంటనే కిందకు దింపి ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. ఉద్యోగం చేసి తమను పోషిస్తావనుకుంటే ఇలా మధ్యలోనే వెళ్లిపోయావా బిడ్డా అంటూ శ్రావణి మృతదేహంపై పడి కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల కలలు ఆవిరి చేసి వెళ్లిపోయావా తల్లి అంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై సతీష్‌ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు