ఎంత బరితెగింపు! సీజ్‌ చేసినా.. మద్యం బార్‌ నిర్వహణ

22 Dec, 2023 09:06 IST|Sakshi

జడ్చర్ల: ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేసిన మద్యం బార్‌ యథావిధిగా కొనసాగడం జడ్చర్లలో చర్చనీయాంశంగా మారింది. 44వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన ఓ స్టార్‌ హోటల్లో నిర్వహిస్తున్న బార్‌ నుంచి గత నెల 15న ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించి డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా మద్యం తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బార్‌లో ఉండాల్సిన మద్యం కాటన్లు ఎక్సైజ్‌ నిబంధనలకు విరుద్ధంగా బయటకు తరలించడంపై ఎక్సైజ్‌ అధికారులు విచారించి బార్‌ను సీజ్‌ చేశారు. ఎక్సైజ్‌ అధికారుల నిబంధనలను బేఖాతరు చేస్తూ బార్‌ను నిర్వాహకులు యథావిధిగా మద్యం విక్రయాలు చేస్తున్నారు.

ఈ విషయాన్ని స్థానిక విలేకరులు ఎక్సైజ్‌ సీఐ బాలాజీ దృష్టికి తీసుకెళ్లారు. తాము మద్యం బార్‌ను సీజ్‌ చేశామని, బార్‌ను మళ్లీ యథావిధిగా కొనసాగిస్తుండడంపై తమకు తెలిసిందన్నారు. మరోసారి విచారించి బార్‌ను సీజ్‌ చేస్తామని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు