Kajal Aggarwal: త్రిషకు షాక్‌! తెరపైకి కాజల్‌ అగర్వాల్‌?

7 Jan, 2023 08:13 IST|Sakshi

సినిమా రంగంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నటుడు అజిత్‌ కొత్త చిత్రం విషయంలోనూ అదే జరుగుతున్నట్లు సమాచారం. ఈయన కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్‌కు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో తన 62వ చిత్రానికి అజిత్‌ రెడీ అవుతున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించబోతోంది. నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

దాదాపు ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార నటించనున్నట్లు టాక్‌ వచ్చింది. అయితే ఇందులో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ మూవీని రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి అజిత్, నయనతారలది హిట్‌ కాంబినేషన్‌. ఇంతకు ముందు ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈ జంట నటించి మెప్పించింది.

ఆ విషయం పక్కన పెడితే అజిత్‌ 62వ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. దీంతో కాజల్‌ అగర్వాల్‌ ఎంపిక చేసినట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. ఈమె ఇంతకుముందు వివేకం చిత్రంలో అజిత్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. అజిత్‌కు జంటగా నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్, కమలహాసన్‌ సరసన ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది.   

మరిన్ని వార్తలు