Nithya Shetty : 'వాటికి దూరంగా ఉంటున్నా. హీరోయిన్‌ అంటే ఆమాత్రం ఉండాలి కదా'

25 Dec, 2022 13:32 IST|Sakshi

కొంత మంది సినిమా కళ కోసమే పుడతారేమో అనిపిస్తుంది వాళ్ల నటనాతృష్ణను చూస్తుంటే! ఆ వరుసలో నటి నిత్యా శెట్టినీ చేర్చొచ్చు. బాలనటిగా వెండితెర మీద పరిచయమై.. ఇప్పుడు హీరోయిన్‌గా రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇటు వెబ్‌ తెర అవకాశాలనూ అందుకుంటోంది.

► చిన్నప్పుడు షూటింగ్‌లో అందరూ నన్ను గారాబం చేసేవాళ్లు. బోల్డన్ని చాక్లెట్లు ఇచ్చేవాళ్లు. అప్పుడు వాటన్నింటినీ ఎంతో ఇష్టంగా తినేదాన్ని. కానీ, ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా. హీరోయిన్‌ అంటే స్లిమ్‌గా ఉండాలి కదా.

నిత్యా శెట్టి నిత్యా పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేసింది కూడా. స్కూల్‌ డేస్‌లోనే బాలనటిగా ‘దేవుళ్లు’, ‘అంజి’ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

► ‘చిన్ని చిన్ని ఆశ’, ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాల్లోని నటనకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డులూ అందుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్‌’, ‘పడేసావే’ చిత్రాల్లోనూ, కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది.

► ‘నువ్వు తోపురా’ సినిమాతో కథానాయికగా నిత్యా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చినా పెద్దగా పేరు రాలేదు. అయితే, ఆమే హీరోయిన్‌గా ఈ మధ్యనే వచ్చిన ‘ఓ పిట్ట కథ’ మంచి విజయం సాధించింది. ఇందులోని నిత్యా నటన ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్‌ అవుతోన్న ‘హలో వరల్డ్‌’ సిరీస్‌తో వీక్షకులను అలరిస్తోంది. 

మరిన్ని వార్తలు