విలన్‌గా మారిన దర్శక నిర్మాత 

21 Dec, 2020 07:15 IST|Sakshi

సినీరంగంలో ఒక శాఖలో పేరు తెచ్చుకున్న వ్యక్తి మరో శాఖలో ప్రవేశించడం సులభమే. అయితే అన్ని శాఖల్లోనూ  రాణించడం అంత సులభం కాదు. అలాంటిది పదమ్‌ కుమార్‌ మాత్రం ఇందుకు అతీతం అనే చెప్పాలి. ఈయన ప్రముఖ ఛాయాగ్రాహకుడు. అంతేకాకుండా భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత కూడా. అంతకుమించి పదమ్‌ కుమార్‌ తండ్రి హెచ్‌ఎస్‌.వేణు దివంగత ప్రఖ్యాత దర్శకుడు విఠలాచార్య దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలకు ఛాయాగ్రహణ అందించారు. కాగా పదమ్‌ కుమార్‌ కూడా హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు చాయాగ్రాహకుడిగా పనిచేశారు. బాలీవుడ్‌ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మించిన దక్షిణాది చిత్రాలకు ఈయన నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. అలా 2014లో నాని, వాణీకపూర్‌ జంటగా నటించిన తెలుగు చిత్రం ఆహా కళ్యాణం పదం కుమార్‌ నిర్మాణ సారథ్యంలోనే రూపొందింది.

అదేవిధంగా తమిళ్‌లో శింబు, వరలక్ష్మి జంటగా నటించిన పోడాపోడీ చిత్రాన్ని నిర్మించి నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేసింది ఈయనే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని మొదటిసారిగా సినిమాకు పరిచయం చేసిన నిర్మాత కూడా పదమ్‌ కుమార్‌నే. ఈయన కథా రచయిత కూడా. అన్ని శాఖల్లో ప్రావీణ్యం కలిగిన పదమ్‌ కుమార్‌ తాజాగా నటుడి అవతారమెత్తారు. ఇటీవల ఓటీటీలో వడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న పావ కథైగళ్‌ సిరీస్‌లో నిలవ్‌ పన్న ఉట్రనుమ్‌ సెగ్మెంట్లో విలన్‌ పాత్రల్లో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. విశేషమేంటంటే తాను దర్శకుడిగా పరిచయం చేసిన విఘ్నేష్‌ శివన్‌నే పదమ్‌ కుమార్‌ను ఈ సిరీస్‌ ద్వారా నటుడిగా పరిచయం చేశారు. 
 

మరిన్ని వార్తలు