ఫారిన్‌కు మహేశ్‌ బాబు.. 'గుంటూరు కారం' ప్రమోషన్స్‌ షూరు

25 Dec, 2023 06:13 IST|Sakshi

‘గుంటూరు కారం’ సినిమాకు గుమ్మడికాయ కొట్టే సమయం ఆసన్నమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది. మహేశ్‌ బాబుతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, ఓ మాస్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట యూనిట్‌.

ఈ పాట పూర్తయితే షూటింగ్‌ దాదాపు పూర్తయినట్లేనని టాక్‌.  చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్‌లు కూడా కంప్లీట్‌ చేసి, ఈ నెలాఖరుకు ‘గుంటూరు కారం’ షూటింగ్‌ పూర్తి అయ్యేలా చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ వెకేషన్‌కు వెళతారట మహేశ్‌బాబు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అక్కడే చేసుకుంటారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఫారిన్‌ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌ తో బిజీ అవుతారు మహేశ్‌. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.

>
మరిన్ని వార్తలు