పార్లమెంట్‌లో భద్రతను ప్రశ్నిస్తే ఎంపీలకు సస్పెండ్‌ చేస్తారా?: మంత్రి పొన్నం ఫైర్‌

19 Dec, 2023 21:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్‌ చేశారని ఆయన మండిపడ్డారు.

కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంట్‌లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్‌ చేశారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాసులు వచ్చాయని, వారిని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పొన్నం ఆరోపించారు. పార్లమెంట్‌.. రాజ్యాంగాన్ని అమలుచేసే వేదిక అని, అక్కడ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు అంటూ బీజేపీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ భద్రతపై విచారణ జరపాలని,  ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని పొన్నం డిమాండ్‌ చేశారు.

అలాగే, బీఆర్‌ఎస్‌ నేతలకు పొన్నం కౌంటరిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం మారిందని బీఆర్‌ఎస్‌ నేతలు గ్రహించాలి. గతంలో బంగారు పాలన అందించామని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ కచ్చితంగా నెరవేస్తుంది. అందులో సందేహించాల్సిన అవసరమే లేదు అని కామెంట్స్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు