Tollywood Drugs Case 2021:రేపు ఈడీ ముందుకు నవదీప్

12 Sep, 2021 19:50 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం ప్రశ్నించనున్నారు. ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌కు సైతం ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. తొలుత ఈ కేసు అంతా డ్రగ్‌ సరఫరాదారుడు కెల్విన్‌ చుట్టూ తిరిగినా, విచారణ క్రమంలో ఎఫ్‌-క్లబ్‌లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. దీంతో సోమవారం నాటి విచారణకు హీరో నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ మేనేజర్‌ హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ఈడీ అధికారులు పలువురి సెలబ్రిటీల నుండి వారివారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించగా.. ఈ కేసులో అప్రూవల్ గా మారిన కెల్విన్‌, అతడి స్నేహితుడు, ఈవెంట్‌ మేనేజర్‌ జీషాన్‌అలీల బ్యాంక్‌ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బుల మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీశారు.ఇక సోమవారం నాటి విచారణలో కెల్విన్ తో జరిపి డ్రగ్స్ లావాదేవీల పై ఆరా తీయనున్నారు. నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ చెప్పే అంశాల ఆధారంగా ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు