Yatra 2 Movie: పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో వైఎస్‌ భారతి లుక్‌ రిలీజ్‌

9 Dec, 2023 16:19 IST|Sakshi

యాత్ర’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్‌ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ ‘యాత్ర’కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మహి. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఇందులో సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటిస్తోంది. నేడు(డిసెంబర్‌ 9) వైఎస్‌ భారతి పుట్టినరోజు. ఈ సందర్భంగా యాత్ర 2 మూవీలో ఆమె క్యారెక్టర్‌ లుక్‌ పోస్టర్‌ని చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఆ పోస్టర్‌పై ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు.’ అని భారతి పాత్ర చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

యాత్ర’ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. 

>
మరిన్ని వార్తలు