మూడేళ్లలో ఏడు కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు

20 Aug, 2022 05:47 IST|Sakshi

పనాజీ/సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాలుగా తెలంగాణ, గోవా నిలిచాయి. గోవా గత మూడేళ్లలో 200 కోట్లకు పైగా ఖర్చుతో 2.63 లక్షల గృహాలకు కుళాయిల ద్వారా నీటి సౌకర్యం కల్పించింది. ఈ సందర్భంగా గోవా ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏడు కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు.

దీంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన మైలురాయిని చేరుకున్నట్టు వెల్లడించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో 52% కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందుతోందని కేంద్ర జలశక్తి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆగస్టు 15న ప్రధాని మోదీ జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించినప్పుడు గ్రామాల్లోని 3.23 కోట్ల (16.90%) కుటుంబాలకు మాత్రమే పైపు నీటి కనెక్షన్‌ అందుబాటులో ఉంది. తెలంగాణ సహా మూడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% కవరేజీని కలిగి ఉన్నాయి. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్‌లో ఉంది.

మరిన్ని వార్తలు