ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్‌తో 10 మంది కన్వరియాలు మృతి.. పలువురికి గాయాలు

1 Aug, 2022 08:23 IST|Sakshi

కోల్‍కతా: పశ్చిమ బెంగాల్ కూచ్‍బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై అందులో ప్రయాణిస్తున్న 10 మంది కన్వరియాలు ప్రాణాలు కోల్పోయారు. వ్యాను జల్పేష్ వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

వ్యానులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పది మంది అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. 16 మందిని జల్‌పాయ్ గుడి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.

వ్యాను వెనుకాల ఏర్పాటు చేసిన డీజే జనరేటర్ తీగలతోనే  విద్యుదాఘాతం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గంగనది పవిత్ర జలం కోసం కన్వరీలతో యాత్ర చేపట్టే శివుని భక్తులను కన్వరియాలు అంటారు. వీరు ఏటా కన్వరియాత్రలో పాల్గొంటారు.
చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి

మరిన్ని వార్తలు