ప్యాసింజర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన టిక్కెట్‌ కలెక్టర్‌..చితకబాది, బూట్లతో తన్నుతూ..

6 Jan, 2023 11:02 IST|Sakshi

ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టిక్కెట్‌ కలెక్టర్లను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన బిహార్‌లోని మజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ముంబై నుంచి ఢిల్లీలోని జైనగర్‌కి వెళ్తున్న ట్రైయిన్‌లోని ఒక ప్రయాణికుడికి, టిక్కెట్‌ కలెక్టర్‌కి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో సదరు టిక్కెట్‌ కలెక్టర్‌ ఆ ప్రయాణికుడుని పైబెర్త్‌ నుంచి కిందకు లాగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతనికి తన సహ టిక్కెట్‌ కలెక్టర్‌ కూడా సహకరించడంతో.. సదరు ప్రయాణికుడి కిందకు లాగి పడేశారు.

ఆ తర్వాత అతన్ని దారుణంగా కొట్టి, బూట్లతో తన్నుతూ.. అత్యంత దారుణంగా ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికుడు రికార్డు చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఐతే అదే సమయంలో మరో ప్రయాణికుడు ముందుకు వచ్చి అతన్ని కొట్టవద్దంటూ టిక్కెట్‌ కలెక్టర్‌ని వారించి, గొడవ సద్దుమణిగేలా చేశాడు.

ఈ ఘటన జనవరి 2న ఢిల్లీలోని ధోలి రైల్వేస్టేషన్‌కి సమీపంలో చోటు చేసుకుంది. సదరు ప్రయాణికుడు టిక్కెట్‌ లేకుండా ప్రయాణించడంతోనే వారి మధ్య వాగ్వాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో రైల్వే శాఖ సదరు టిక్కెట్‌ కలెక్టర్‌లను సస్పెండ్‌ చేసినట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన విషయమై అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని పేర్కొన్నారు.

(చదవండి: ముంబైలో బాలీవుడ్‌ సెలబ్రెటీలతో యోగి భేటీ)

మరిన్ని వార్తలు