గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు: విక్టరీ సంగతి ఏమోగానీ.. ఆప్‌కు ఆ విషయమై ఉత్కంఠ!

8 Dec, 2022 09:21 IST|Sakshi

ఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపీ, ఆప్ కొత్త రికార్డుల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. గుజరాత్‌లో వరుసగా 7వ సారి గెలిచి దేశంలో కమ్యూనిస్టు పార్టీ విజయం(పశ్చిమ బెంగాల్‌) రికార్డును సమం చేయనున్న బీజేపీ. అలాగే.. ఈ ఎన్నికలతో జాతీయ పార్టీగా అవతరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. 

ఏదైనా పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అర్హత పొందుతుంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఆప్. ఇక ఆ మధ్య గోవాలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు తోడు గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏదో ఒక చోట 6 శాతం దాటితే జాతీయ పార్టీగా అర్హత పొందినట్లు అవుతుంది. 

అంటే గుజరాత్‌లో కనీసం రెండు సీట్లు గెలిచినా సరిపోతుంది ఆప్‌. ఒకవేళ జాతీయ పార్టీగా మారితే.. దేశంలో జాతీయ పార్టీ హోదా సాధించిన ఎనిమిదవ పార్టీగా ఆప్‌ నిలవడంతో పాటు ఈవీఎం మెషీన్లలో మొట్టమొదటి పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్‌ ఉండనుంది.

2021లో సూరత్ మున్సిపల్‌ ఎన్నికలలో 28% ఓట్ల వాటాను సాధించడం ద్వారా కాంగ్రెస్ స్థానంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శనను కనబరుస్తామని ఆశిస్తోంది. 2024 ఎన్నికలకు జాతీయ పార్టీ హోదాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఆప్‌కి ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి.

మరిన్ని వార్తలు