రావణ దహనంలో పాల్గొన్న ప్రభాస్‌.. అందుకే ఆహ్వానించామన్న కమిటీ

5 Oct, 2022 20:33 IST|Sakshi
Photo Source: Twitter

ఢిల్లీ: సౌత్‌ స్టార్ల క్రేజ్‌ దేశం మొత్తం విస్తరిస్తోంది.  తాజాగా టాలీవుడ్‌ నటుడు ప్రభాస్‌ ‘రావణ దహన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఢిల్లీ లవ్‌ కుశ్‌ రామ్‌లీల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. ఆయన్ని చూసేందుకు, ఫొటోలు తీసేందుకు జనం ఎగబడ్డారు.

భారత సంస్కృతి పట్ల ప్రభాస్‌కు ఉన్న అంకిత భావం చూసే ఆయన్ని పిలిచామని లవ్‌ కుశ్‌ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్‌ అర్జున్‌ కుమార్‌ ప్రకటించారు. కోవిడ్ ఫరిస్థితుల్లో రెండేళ్లుగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందువల్ల కమిటీ నిర్వహకులు ఈ సారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా.. ప్రభాస్‌ అతిథిగా పాల్గొనడం విశేషం.

సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీతో పాటు దేశం మొత్తం ఆయన పేరు, ప్రఖ్యాతలు విస్తరించాయి. మన భారత చరిత్రలో వేళ్లానుకున్న కథలను ఆయన చిత్రాలుగా ఎంచుకుంటున్నారు. బాహుబలి లాంటి కథతో పాటు ఇప్పుడు ఆదిపురుష్‌ లాంటి పౌరాణిక చిత్రంలో ఆయన నటించారు. రాముడి పాత్రలో నటించారు గనుకే రావణ దహనం ఈ ఏడాది ఆయనతో చేయిస్తున్నాం అని కుమార్‌ ప్రకటించారు. 

ఇక రామ్‌ లీలా మైదానంలో ఆదిపురుష్‌ టీం సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌, టీ సిరీస్‌ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వాళ్లిచ్చిన కానుకలను స్వీకరించాడు ప్రభాస్‌. ఆపై విల్లు ఎక్కుపెట్టి.. రావణ దిష్టిబొమ్మకు సంధించాడు. కార్యక్రమం చివర్లో.. రామావతారంలో ఉన్న నటులకు డైరెక్టర్‌ ఓం రౌత్‌తో కలిసి హారతి పట్టాడు ప్రభాస్‌. అంతకు ముందు రామాయణంలోని ఘట్టాలు ప్రదర్శించే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆదిపురుష్‌ టీజర్‌ను సైతం ప్రదర్శించారు.

     Video Credits: GNTTV Twitter

మరిన్ని వార్తలు