Agnipath Scheme Notification 2022: ఆర్మీలో అగ్నివీర్‌ తొలి నోటిఫికేషన్‌ విడుదల

20 Jun, 2022 14:26 IST|Sakshi

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో కూడా అగ్నివీర్‌ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు  అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఓ వైపు అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతుంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలపై తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది.
చదవండి: భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌: వందల సంఖ్యలో రైళ్లు రద్దు

పథకం స్వరూపం... 
►ఇది ఆఫీసర్‌ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్‌) నియామక ప్రక్రియ. 
►త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్‌లైన్‌ సెంట్రలైజ్డ్‌ విధానంలో ర్యాలీలు, క్యాంపస్‌ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. 
►ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. 
►వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. 
►త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. 
►సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్‌ క్లాస్‌’ విధానంలో రిక్రూట్‌మెంట్‌ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్‌ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. 
►విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. 
►వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్‌ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. 
►నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు.
►సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. 
►గ్రాట్యుటీ, పెన్షన్‌ బెనిఫిట్స్‌ ఏమీ ఉండవు. 
► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. 
►మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం.

మరిన్ని వార్తలు