ఆర్యన్‌ ఖాన్‌ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్‌ కమిటీ

20 Oct, 2022 05:07 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్‌ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్‌ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్‌ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్‌ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ఆర్యన్‌తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే.

కానీ ఆర్యన్‌ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్‌ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్‌తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్‌ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్‌షీట్‌ నమోదు చేసింది. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు కమిటీ గత మేలో క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్‌ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది.

మరిన్ని వార్తలు