Diwali: దీపావళి రెండు గంటలే.. హైకోర్టు కీలక ఆదేశాలు 

2 Nov, 2021 08:20 IST|Sakshi

రాత్రి 8 నుంచి 10 గంటల వరకే టపాసులు పేల్చేందుకు అనుమతి 

దీపావళి సంబరాలపై హైకోర్టు కీలక ఆదేశాలు 

భువనేశ్వర్‌: దీపావళి సంబరాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం రెండు గంటలు మాత్రమే దీపావళి జరుపుకోవాలని సూచించింది. దీంతో రాత్రి 8 నుంచి 10 గంటల వరకే టపాసులు పేల్చేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా విజృంభణకు తావులేకుండా వేడుకల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. బేరియమ్‌ సాల్ట్స్‌తో తయారైన బాణసంచా వినియోగాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు అక్టోబరు 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పండగ నిర్వహణపై సోమవారం తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు కోవిడ్‌–19 వ్యాప్తి కట్టడి దృష్ట్యా సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) జారీచేసిన మార్గదర్శకాల పరిధిలో రాష్ట్రంలో బాణసంచా క్రయ విక్రయాలు, వినియోగానికి సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్‌ ఎస్‌ఆర్‌సీని కోరింది. 

దీనికోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కటక్‌–భువనేశ్వర్‌ జంట నగరాల పోలీస్‌ కమిషనరేట్‌తో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. బాణసంచా క్రయ విక్రయాల అనుమతి అభ్యర్థనతో అఖిల ఒడిశా ఫైర్‌వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ పురస్కరించుకుని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(పెసో) ఆమోదించిన హరిత బాణసంచా క్రయవిక్రయాలు, వినియోగానికి ధర్మాసనం అనుమతించడం విశేషం.  

చదవండి: (నా చేతులతో ఎత్తుకుని ఆడించా.. ఈ బాధలు ఎవరికీ రాకూడదు: శివ రాజ్‌కుమార్‌)

మరిన్ని వార్తలు