గుండెపోటుతో బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలి హఠాన్మరణం

23 Aug, 2022 11:22 IST|Sakshi

ఛండీగఢ్‌: టీవీ యాంకర్‌, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌(43) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. తోటి ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె.. సోమవారం రాత్రి గుండె పోటుతో అక్కడే కన్నుమూసినట్లు సమాచారం. 

2006లో టీవీ యాంకర్‌గా, టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సోనాలి ఫోగట్‌.. రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. టిక్‌ టాక్‌ ద్వారా ఆమె పాపులారిటీ మరింత పుంజుకుంది. దీంతో బీజేపీ ఆమెను స్టార్‌ క్యాంపెయినర్‌గా మార్చేసుకుంది. సోషల్‌ మీడియాలో సోనాలికి ఫాలోయింగ్‌ ఎక్కువే.

2019 హర్యానా ఎన్నికల్లో ఆమె అదాంపూర్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్‌ నేత కుల్దీప్‌ బిష్ణోయ్‌ చేతిలో ఓడిపోయారు. అయితే.. అనూహ్యంగా కిందటి నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిష్ణోయ్‌.. బీజేపీలో చేరారు. 

పోయినవారం సోనాలి ఫోగట్‌తో బిష్ణోయ్‌ భేటీ కావడంతో.. అదాంపూర్‌ ఉపఎన్నికలో సోనాలినే అభ్యర్థిగా నిలబడతారనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆమె కన్నుమూయడం గమనార్హం.

సోనాలి ఫోగట్‌ భర్త 2016లో హిస్సార్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. 2020లో ఓ అధికారిని చెప్పుతో కొట్టి ఆమె వివాదంలో నిలిచారు.

ఇదీ చదవండి: చంటిబిడ్డతో ఫుడ్‌ డెలివరీ.. ఆ తల్లికి అంతా ఫిదా

మరిన్ని వార్తలు