-

Karnataka BJP Leader Murder: అర్ధరాత్రి టెన్షన్‌.. టెన్షన్‌.. బైక్‌పై వెంబడించి మరీ బీజేపీ నేతను చంపారు

27 Jul, 2022 10:44 IST|Sakshi

కర్నాటకలో ఒక్కసారిగా ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా అతడిని నరికి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, ప్రవీణ్‌ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది.  కాగా.. ప్రవీణ్‌ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు. అయితే, మంగళవారం రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు.

అనంతరం.. రక్తపు మడుగులో పడివున్న అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రవీణ్‌ను పుత్తూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ప్రవీణ్‌ మృతిచెందాడు. ఈ విషయం కాస్తా.. బీజేపీ నేతలు, యువమోర్చా నాయకులకు తెలియడంతో వారు భారీ సంఖ్యతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి రోడ్డుపై కూర్చోని నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది.  

ఈ ఘటన కర్నాటకలో చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్‌ హత్యపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. యువ నాయకుడు దారుణహత్యకు గురికావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ప్రవీణ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. నిందితులను త్వరగా పట్టుకుంటామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

ఇది కూడా చదవండి: రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్‌తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి!

మరిన్ని వార్తలు