10, 12 తరగతుల ఫలితాలపై సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు.
ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు.