‘గ్రీన్‌లైన్‌’పై చైనా గురి

6 Sep, 2020 04:02 IST|Sakshi

మొత్తం చుషుల్‌ లోయ స్వాధీనమే డ్రాగన్‌ లక్ష్యం

భారత సైన్యం అప్రమత్తత

ముందస్తు మోహరింపులతో చైనాకు చెక్‌

న్యూఢిల్లీ: గత నెలాఖరులో లద్దాఖ్‌లో చైనా సైన్యం (పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ– పీఎల్‌ఏ) పెద్ద పన్నాగమే పన్నింది. లద్దాఖ్‌తో టిబెట్‌ సరిహద్దును చైనా ‘గ్రీన్‌లైన్‌’తో నిర్వచిస్తోంది. ఈ గ్రీన్‌లైన్‌ పాంగాంగ్‌ సరస్సు ఉత్తరతీరంలోని ఫింగర్‌–4 పర్వత ప్రాంతం మీదుగా వెళుతూ... దక్షిణతీరంలోని చుషుల్‌ లోయ మొత్తాన్ని చైనా భూభాగంగా చూపిస్తుంది. 1960లో చైనా తయారుచేసిన మ్యాప్‌ ఇది.

ఆగస్టు 29– 30 మధ్యరాత్రి వేళ పీఎల్‌ఏ దుస్సాహసానికి దిగింది. ఈ గ్రీన్‌లైన్‌ మేరకు భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా పెద్ద ఎత్తున బలగాలతో ముందుకు కదిలింది. వాస్తవా«ధీన∙రేఖ వద్ద ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నించింది. ‘పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలోని కీలకమైన అన్ని పర్వత ప్రాంతాలపై, చుషుల్‌లో మోహరించడం ద్వారా భారత స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ ప్రత్యర్థి కదలికలకు చెక్‌ పెట్టింది. లేకపోతే మొత్తం చుషుల్‌ లోయను పీఎల్‌ఏ తమ స్వాధీనంలోకి తీసుకునేది.

ఎలాగైనా గ్రీన్‌లైన్‌ను చేరుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆరోజు చైనా సైన్యం ముందుకు కదిలింది. భారీ ట్యాంకులు, భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్స్, భారీ తుపాకులను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించి భారత సైన్యాన్ని వెనుకడుగు వేసేలా బెదరగొట్టాలని చూసింది. అయితే వెంటనే అప్రమత్తమైన భారత్‌... ఫింగర్‌–4పై, పాంగాంగ్‌ దక్షిణ తీరంలో తమ బలగాల మోహరింపులో మార్పులు చేర్పులు చేసింది. తదుపరి అడుగు వేయడానికి చైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేసింది. అలా డ్రాగన్‌ దురాక్రమణ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది’ అని భారత సైనిక ఉన్నతాధికారి ఒకరు వివరించారు.  

రెండు చోట్ల ఎదురెదురుగా...
ఒకవైపు శుక్రవారం రష్యాలో ఇరుదేశాల రక్షణశాఖ మంత్రుల సమావేశం జరిగినప్పటికీ... సరిహద్దుల్లో మాత్రం చైనా ఇంకా తన దుందుడుకు చర్యలను ఆపడం లేదు. చుషుల్‌ లోయలోని రెచిన్‌ లా ప్రాంతంలో, బంప్‌ అనే మరోచోట భారత్‌– చైనా సైన్యాలు ఎదురెదురుగా మోహరించాయి. సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని చైనా పెంచుతూనే ఉంది. బంప్‌కు అభిముఖంగా, వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న బ్లాక్‌టాప్‌ శిఖరంపై పీఎల్‌ఏ 150 మంది సైనికులను, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌ను మోహరించింది.   

మరిన్ని వార్తలు