Women Reservation Bill: బిల్లుకు అయిష్టంగానే విపక్షాల ఆమోదం

26 Sep, 2023 06:26 IST|Sakshi

గత్యంతరం లేకే మద్దతిచ్చాయి 

మా పట్టుదల వల్లే పార్లమెంట్‌లో బిల్లు నెగ్గింది 

అహంకార కూటమికి అధికారం అప్పగిస్తే బిల్లు పరిస్థితి వెనక్కే 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగం  

భోపాల్‌/జైపూర్‌: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లుకు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మరో గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మద్దతు ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీశక్తిని అర్థం చేసుకొని, సంకోచిస్తూనే బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. తమ పట్టుదల వల్లే బిల్లు పార్లమెంట్‌లో నెగ్గిందని వివరించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో మనకు తెలిసిందేనని అన్నారు.

ఒకవేళ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అహంకార కూట మికి అధికారం అప్పగిస్తే ఈ బిల్లు విషయంలో వెనక్కి మళ్లుతాయంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. బిల్లు పరిస్థితి వెనక్కి వెళ్లిపోతుందని పరోక్షంగా స్పష్టం చేశారు. జనసంఘ్‌ సహ వ్యవస్థాపకుడు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సోమవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్‌’లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని తుప్పు పట్టిన ఇనుముతో పోల్చారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్‌కు అలవాటేనని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ను రాజకీయ నాయకులు నడిపించడం లేదని, పార్టీని అర్బన్‌ నక్సలైట్లకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌ విధానాలను, నినాదాలను ఈ లీజుదారులే నిర్ణయిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గనుక గెలిపిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తారని విమర్శించారు.  

కాంగ్రెస్‌ దివాలా తీసింది  
కాంగ్రెస్‌ దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేస్తోందని, దేశం సాధించిన ఘనతలను ఆ పార్టీ ఇష్టపడడం లేదని ప్రధానమంత్రి మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థను కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని, కానీ, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ మనోబలం కోల్పోయిందని, దివాలా తీసిందని చెప్పారు. అందుకే అర్బన్‌ నక్సలైట్లకు పార్టీని లీజుకు ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజాబలం లేదన్నారు. మహిళలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే వారంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలన్నదే కాంగ్రెస్‌ విధానమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

 రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించాలి  
రాజస్తాన్‌లో సీఎం అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం యువత జీవితాల్లో ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘పరివర్తన్‌ సంకల్ప్‌ మహాసభ’లో మాట్లాడారు. పరిపాలన పరంగా కాంగ్రెస్‌ సర్కారుకు సున్నా మార్కులే వస్తాయన్నారు. కాంగ్రెస్‌ పాలనలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇచి్చందని చెప్పారు.

మరిన్ని వార్తలు