బోర్డింగ్ పాస్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో దాడి 

18 Nov, 2020 09:53 IST|Sakshi

గాంధీనగర్‌/ అహ్మదాబాద్‌: ఆలస్యంగా రావడంతో బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన ఎస్సై ర్యాంక్‌ క్యాడర్‌ వ్యక్తి విమానాశ్రయ సిబ్బంది చెంప చెళ్లుమనిపించిన ఘటన అహ్మాదాబాద్‌ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివరాలు.. గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మంగళవారం అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. వారంతా ఢిల్లీకి వెళ్లడం కోసం స్పైస్‌జెట్‌ ఎస్‌జీ-8194 విమానంలో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే వారు ఆలస్యంగా రావడంతో సిబ్బంది బోర్డింగ్‌కు అనుమతివ్వలేదు. దాంతో పోలీసు అధికారి, స్పైస్‌జెట్‌ స్టాఫ్‌తో గొడవకు దిగాడు. తమకు బోర్డింగ్‌ పాస్‌ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు అధికారి.. సిబ్బంది చెంప పగలకొట్టాడు. (చదవండి: పైలట్‌పై ముసుగు దొంగల దాడి)

దాంతో ఎస్సైతో పాటు ఉన్న మిగతా ఇద్దరు ప్రయాణీకులకు, సిబ్బందికి మధ్య గొడవ తీవ్రం అయ్యింది. పరిస్థితిని నియంత్రించడానికి విమానాశ్రయ భద్రతా సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ స్టాఫ్‌ రంగంలోకి దిగారు. అనంతరం విమాన్రాశయ ఉద్యోగిని, సదరు పోలీసు అధికారితో పాటు ఉన్న మిగతా ఇద్దరిని స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఆ తర్వాత వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. కానీ సదరు పోలీసు అధికారిని మాత్రం విమానంలో ప్రయాణించేందుకు అనుమతించలేదు. 

మరిన్ని వార్తలు