రాహుల్‌పై చర్యలు తీసుకోండి.. ఈసీకి హైకోర్టు ఆదేశం

21 Dec, 2023 18:20 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీలను ‘పిక్‌ పాకెట్స్‌’గా అభివర్ణించిన కేసులో రాహుల్‌పై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

కాంగ్రెస్‌ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని ధర్మాసనం పేర్కొంది. రాహుల్‌ కామెంట్స్‌పై చర్యలు తీసుకునేందుకు ఎలక్షన్‌ కమిషన్‌కు ఎనిమిది వారాల గడువు విధించింది. అయితే ఈ విషయాన్ని ఈసీఐ పరిశీలిస్తున్నందున దీనిని ఎన్నికల సంఘమే పరిష్కరిస్తుందని ఢిల్లీ హైకోర్టు తమ ఉత్వర్వుల్లో తెలిపింది.

కాగా ఇప్పటికే పిక్‌పాకెట్స్‌ కేసు వ్యవహారాన్ని ఈసీ విచారిస్తుంది. నవంబర్‌ 26 లోపు సమాధానం ఇవ్వాలని నవంబర్‌ 23న ఎన్నికల సంఘం రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయినప్పటికీ రాహుల్‌ స్పందించలేదు. దీంతో కోర్టు ఆయనపై చర్యలకు ఆదేశించింది. అయితే ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం కోర్టు స్పష్టం చేయలేదు.
చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఆర్మీ కాన్వాయ్‌పై కాల్పులు

>
మరిన్ని వార్తలు