‘తాబేలు’ కూర మాడిందని భార్యను చంపి.. గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేసి.. హైడ్రామా!

22 Oct, 2022 19:45 IST|Sakshi

భువనేశ్వర్‌: కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించటం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఒడిశాలోని సంబల్పూర్‌ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 35 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బద్మాల్‌ పంచాయతీలోని రౌత్‌పారా గ్రామానికి చెందిన రంజన్‌ బడింగ్‌(36) అనే వ్యక్తి అక్రమంగా వేటాడి తాబేలును ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య సావిత్రిని కూర చేయమని చెప్పాడు. అయితే, వంట చేస్తుండగా అది కాస్త మాడిపోయింది. దీంతో తాగిన మత్తులో ఉన్న నిందితుడు భార్యతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను అలాగే వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి వచ్చే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరి నమ్మించే ప్రయత్నం చేశాడు. 

బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి పట్టుకోవటంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై 10 మంది గ్యాంగ్‌ రేప్‌

మరిన్ని వార్తలు