‘రాహుల్‌కు పెళ్లి కాలే.. గర్ల్స్‌ మీరు వెళ్లొద్దు’

30 Mar, 2021 20:23 IST|Sakshi

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కేరళలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఈ సమయంలో వ్యక్తిగత దూషణలకు తెర లేచింది. ఈ క్రమంలోనే ఓ మాజీ ఎంపీ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మాయిలు రాహూల్‌ వద్దకు వెళ్లకండి. అతడికి ముందే పెళ్లి కాలేదు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ సభలో మాజీ ఎంపీ జోయెస్‌ జార్జ్‌ ఆయన మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. ‘‘రాహుల్‌ గాంధీకి అసలే పెళ్లి కాలేదు. అతడి వద్దకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహుల్‌ కార్యక్రమాలన్నీ మహిళల విద్యాలయాల్లోనే జరుగుతాయి. అక్కడకు వెళ్లి రాహుల్‌ అమ్మాయిలకు ఎలా వంగాలి?, ఎలా నిలబడాలి? అని నేర్పుతాడు. అందుకే నా ప్రియమైన అమ్మాయిలు రాహుల్‌ వద్దకు వెళ్లి ఇలాంటి పనులు చేయవద్దు. అతడికి పెళ్లి కాలేదు’ అని జోయెస్‌ జార్జ్‌ పేర్కొన్నాడు.

రాహుల్‌ గాంధీ..  సోమవారం కేరళ ప్రచారంలో పాల్గొన్నారు. కొచ్చిలో ఏర్పాటుచేసిన సభలో కొంతమంది అమ్మాయిలకు రాహుల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మెలకువలను స్వయంగా నేర్పారు. దీన్నిటార్గెట్‌ చేస్తూ జోయెస్‌ జార్జ్‌ మాట్లాడటంపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధులు ధర్నా చేపట్టారు. జోయెస్‌ జార్జ్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు