హైకోర్టు జడ్డి మీదకు చెప్పులు...18 నెలల జైలు శిక్ష

4 Jun, 2021 19:01 IST|Sakshi

అహ్మదాబాద్‌: 9 ఏళ్లుగా తన కేసును పెండింగ్‌లో పెడుతున్నారనే కోపంతో ఒక వ్యక్తి తీర్పు చెప్పే హైకోర్టు జడ్జిపైకి చెప్పులు విసిరాడు. దీనికి ప్రతిఫలంగా సదరు వ్యక్తి 18 నెలల జైలు శిక్ష అనుభవించనున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ హైకోర్టులో చోటుచేసుకుంది.వివరాలు.. అహ్మదాబాద్‌కు చెందిన బావాజీ అనే వ్యక్తి భయావదర్ మున్సిపాలిటీలో పరిధిలో రోడ్డుపై టీస్టాల్‌ నడుపుకునేవాడు. అయితే 2012లో రోడ్డు విస్తరణలో భాగంగా బావాజీని టీస్టాల్‌ను తీసేయాలంటూ మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు.

అయితే ఈ విషయంపై బావాజీ గోండల్‌ సెషన్స్‌ కోర్టు నుంచి టీస్టాల్‌ పడగొట్టకుండా స్టే ఆర్డర్‌ను తెచ్చుకున్నాడు. దీంతో భయావదర్‌ మున్సిపాలిటీ అధికారులు బావాజీ స్టే ఆర్డర్‌పై అహ్మదాబాద్‌  హైకోర్టుకు అప్పీల్‌ చేసింది. కాగా హైకోర్టు బావాజీ స్టే ఆర్డర్‌ను రద్దు చేసి అతని టీస్టాల్‌ను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు బావాజీ టీ స్టాల్‌ను తొలగించారు. తనకు ఆదాయం వచ్చేదానిని కోల్పోయిన అతను మానసికంగా దెబ్బతిన్నాడు. అప్పటినుంచి తనకు న్యాయం జరగాలంటూ తెలిసినవారి నుంచి అప్పులు తీసుకుంటూ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.

తాజాగా మరోసారి కోర్టుకు వచ్చిన బావాజీ.. 9 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనీసం తన కేసును హియరింగ్‌ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డి స్థానంలో ఉన్న మిర్జాపూర్‌ గ్రామీణ కోర్టు చీఫ్‌ జ్యుడిషీయల్‌ మెజిస్ట్రేట్‌ వి.ఏ ధాదళ్‌పై చెప్పులు విసిరాడు. ఈ పరిణామాన్ని ఊహించని జడ్డి షాక్‌కు గురయ్యాడు.. కానీ అదృష్టవశాత్తు ఆ చెప్పులు ఆయనకు తగల్లేదు. అక్కడే ఉన్న పోలీసులు బావాజీని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షా స్మృతి కింద సెక్షన్‌ 353 ప్రకారం ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా దాడికి దిగినందుకుగాను అతనికి 18 నెలల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఇది సాధారణ శిక్ష మాత్రమే అని.. శిక్షాకాలంలో సత్ఫప్రవర్తనతో మెలిగితే  విడుదల చేసే నిబంధన అతనికి వర్తింస్తుందని తీర్పునిచ్చారు. కాగా ప్రస్తుతం బావాజీని సోలా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
చదవండి: జైలుకెళ్లడం కోసం ప్రధాని మోదీకి బెదిరింపు కాల్‌ చేశాడట..!

మరిన్ని వార్తలు