అదిరిపోయే దివాలీ గిఫ్ట్‌: సంబరాల్లో కంపెనీ ఉద్యోగులు

3 Nov, 2023 19:48 IST|Sakshi

ఉద్యోగులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఫార్మాకంపెనీ మిట్స్‌కార్ట్

దివాలీ గిఫ్ట్‌గా టాటా పంచ్‌ కార్లు

హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ తన ఉద్యోగులకు రానున్న దీపావళికి కార్లను బహుమతిగా ఇచ్చింది. తన ఆఫీస్ హెల్పర్‌తో సహా 12 మంది ఉద్యోగులకు  సరికొత్త టాటా పంచ్‌ కార్లను గిఫ్ట్‌గా అందించింది  కంపెనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అంతేకాదు  తన ఉద్యోగులే తనకు సెలబ్రిటీలు అని పేర్కొనడం విశేషంగా నిలిచింది. 

హర్యానా,  పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్‌కార్ట్ ఛైర్మన్  కార్లను కానుకగా ఇచ్చారు. అంతేకాదు తమ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ఛైర్మన్ ఎంకె భాటియా. వారి అంకితభావం, కృషి తనను  ముగ్ధుడ్ని  చేసిందనీ, అందుకే  వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కంపెనీ ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది అయినా  ఉద్యోగులు తమతోనే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని పేర్కొన్నారు. వాళ్లే తమ  స్టార్స్‌ అంటూ భాటియా సంతోషం వ్యక్తం చేశారు.  దీంతో అటు ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.

కారు తాళాలను  ఉద్యోగులిస్తున్న వీడియోను లింక్డ్‌ఇన్  పోస్ట్‌ చేశారు. కంపెనీ పట్ల వారి నిబద్ధతకు,  విశ్వాసానికి గుర్తుగా నెల రోజుల క్రితమే కార్లు అంద జేశానని, అంతేకానీ దీపావళి సందర్బంగా ప్లాన్‌ చేసింది కాదంటూ వివరించారు. ఈ సమయంలో వార్తలు రావడం యాదృచ్చిక మన్నారు. అలాగే సమీప భవిష్యత్తులో మరో 38 మందికి కూడా ఈ గిప్ట్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్లు మిట్స్‌కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే కలలో కూడా ఊహించని  కార్లను  బహుమతిగా అందుకోవడం పట్ల ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు.. వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా తెలియదట. 

 టాటా పంచ్‌
టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్‌ 2021 లో లాంచ్‌ అయింది. టాటా పంచ్  అనేది ఎంట్రీ-లెవల్ మైక్రో SUV.  ఈ వెహికల్‌  ప్రారంభ ధర సుమారు రూ. 6లక్షలు 

 

మరిన్ని వార్తలు