హనీమూన్‌లో విషాదం.. వివాహమై 20 రోజులు కాకుండానే..

17 Dec, 2022 02:48 IST|Sakshi

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌ 

నవ దంపతులకు తీవ్ర గాయాలు 

చికిత్స పొందుతూ భర్త మృతి 

యశవంతపుర: చూడ చక్కని జంట. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన ఆ దంపలను చూసి విధికి కన్నుకుట్టింది. హనీమూన్‌ ముగించుకొని ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను మోసుకొని ఇంటికి వస్తుండగా మృత్యువు పంజా విసిరి నవ వరుడిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన హావేరి జిల్లా హిరేకరూరు తాలూకా కొడద గ్రామం వద్ద జరిగింది. 

వివరాలు ఇలా ఉన్నాయి.. దావణగెరె జిల్లా హరిహర తాలూకా జిగళి గ్రామానికి చెందిన మఠం రాజయ్య, శోభ దంపతుల కుమారుడు సంజయ్‌(28) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. నవంబర్‌ 28న బైలహొంగలకు చెందిన టెక్కీ ప్రీతితో వివాహమైంది. కాపురం ఉండేందుకు బెంగళూరులో అద్దె ఇల్లు చూశారు. 12న ఆ ఇంటిలో చేరాల్సి ఉంది. అయితే హనీమూన్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 

శనివారం ఉదయం సిగందూరు చౌడేశ్వరిని దర్శించుకున్న జంట.. ఆదివారం శిరసి మారికాంబా దేవిని దర్శించుకొని తిరిగి జిగళికి వస్తుండగా హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా కొడద వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఇద్దరికీ బలమైన గాయాలు కావడంతో రాణెబెన్నూరు ఆస్పత్రికి, తర్వాత దావణగెరెకు తరలిస్తుండగా మార్గం మధ్యలో సంజయ్‌ మృతి చెందాడు. స్ట్రెచర్‌లో విగతజీవిగా ఉన్న సంజయ్‌ను చూసి భార్య ప్రీతి కన్నీరుమున్నీరైంది. పోస్టుమార్టం అనంతరం సంజయ్‌ మృతదేహాన్ని జిగళి గ్రామానికి తరలించారు. 

మరిన్ని వార్తలు