షిర్డీ సాయికి రూ. 33 లక్షలతో బంగారు కిరీటం

23 Jul, 2022 04:09 IST|Sakshi

అందజేసిన హైదరాబాద్‌ వైద్యుడు మందా రామకృష్ణ 

షిర్డీ: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మందా రామకృష్ణ(80) షిర్డీ సాయిబాబాకు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని శుక్రవారం అందజేశారు. ఈ విషయాన్ని శ్రీసాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు సీఈఓ భాగ్యశ్రీ బనాయత్‌ వెల్లడించారు. ఈ కిరీటం బరువు 707 గ్రాములు. 35 గ్రాముల అమెరికా వజ్రాలను కిరీటంలో పొదిగారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మందా రామకృష్ణ మాట్లాడుతూ.. తాను భార్యతో కలిసి 1992లో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నానని చెప్పారు.

ఆ సమయంలో సాయిబాబా ఆలయ పూజారి ఒక కిరీటాన్ని తమకు చూపించారని అన్నారు. అలాంటి కిరీటాన్నే సాయిబాబాకు అందజేస్తానని తన భార్యకు మాట ఇచ్చానన్నారు. అప్పట్లో తన వద్ద తగినంత డబ్బు లేదని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలో 15 ఏళ్లపాటు వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేశానని, అలా వచ్చిన డబ్బుతో కిరీటం తయారు చేయించి, సాయిబాబా పాదాల వద్ద పెట్టానని వివరించారు. డాక్టర్‌ రామకృష్ణ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతిచెందారు.   
 

మరిన్ని వార్తలు