-

వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక

23 Jul, 2023 06:09 IST|Sakshi

న్యూఢిల్లీ:  వియత్నాంకు భారత్‌ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్‌ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ వెల్లడించారు.

వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్‌ కామ్‌ రన్హ్‌ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్‌ జీ20 సదస్సు ప్రధాన థీమ్‌ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ జూన్‌ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది.

మరిన్ని వార్తలు