ఇండియన్‌ ఐడల్‌లో హసదేవ్‌ డిర్డో సందడి

5 Aug, 2021 13:34 IST|Sakshi

సోషల్‌ మీడియా రాకతో కుగ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తమలోని కళలు, ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్‌ మీడియా మంచి వేదికగా మారింది. సామాజిక మాధ్యమాలతో ఓవర్‌నైట్‌ స్టార్లుగా మారుతున్న వారిని చూస్తున్నాం. తాజాగా ఓ బుడతడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఒక్క పాటతో ఇప్పుడు ఏకంగా ప్రఖ్యాత పాటల షోలో ప్రత్యక్షమయ్యాడు. (చదవండి: ఆ పాట నన్ను నిద్రపోనివ్వడం లేదు.. అనుష్క శర్మ)

ఆ బుడ్డోడే చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్‌ డిర్డో. పాఠశాలలో ‘బచ్ పన్ కా ప్యార్ హై’ పాట సరదాగా పాడుతుండగా కొందరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చేరింది. ఆ బుడతడి గొంతు విని అందరూ ఫిదా అయ్యారు. జూలై 3వ తేదీన విడుదలైన ఆ వీడియో ఇప్పటివరకు 9 మిలియన్లకు పైగా వ్యూవ్స్‌ పొందింది. 

చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆ బాలుడు హసదేవ్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. తన వద్దకు పిలిచి మరీ ‘బ‌చ్ ప‌న్ కా ప్యార్’ అంటూ పాట పాడించుకుని దీవించారు. అనంతరం ఆ వీడియోను సీఎం నెటిజన్లతో పంచుకున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా  ఫిదా అయిపోయారు. ఇప్పుడు హసదేవ్‌ సోనీ టీవీ నిర్వహించే ఇండియన్‌ ఐడల్‌ పాటల -12 పోటీల్లో ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ నేపథ్య గాయకుడు ఆదిత్య నారాయణ్‌ తెలిపాడు. 

సహదేవ్‌ ఇండియన్‌ ఐడల్‌ షోలో సందడి చేస్తున్న వీడియోను ఆదిత్య షేర్‌ చేశాడు. ఈ సమయంలో సహదేవ్‌ మళ్లీ బచ్‌పన్‌ కా ప్యార్‌ పాట పాడుతూ కనిపించాడు. బుడ్డోడు పాట పాడుతుంటే జడ్జిలు అను మాలిక్‌, సోనూ కక్కర్‌తో పాటు పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన గాయనీగాయకులు చిందేస్తున్నారు. సహదేవ్‌ రాకతో సందడిగా మారింది. ప్రస్తుతం ఇండియన్‌ ఐడల్‌ పోటీలు సెమీ ఫైనల్‌కు చేరాయి. ఆగస్టు 15వ తేదీన ఫైనల్‌ పోటీలు జరగనున్నాయి.
 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial)

A post shared by vishnu_singh91 (@only_mod031zzz)

మరిన్ని వార్తలు