అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డ రైలు పట్టాలపై..

26 Jul, 2021 14:50 IST|Sakshi

పట్టాలపై పసికందు మృతదేహం

 కేంద్రాస్పత్రి మార్చురీకి తరలింపు 

సాక్షి, విజయనగరం/ఒడిశా: అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ పసిబిడ్డ రైలు పట్టాలపై అచేతనంగా పడి ఉన్నాడు. ఏ తల్లి కన్నబిడ్డో... ఆ తల్లిదండ్రులకు ఏం కష్టం వచ్చిందోగాని  ఇలా పట్టాలపై పడేశారు. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. రైలు పట్టాలపై రెండు నెలల పసికందు మృతదేహం ఆదివారం లభ్యమైంది. దీనికి సంబంధించి రైల్వే జీఆర్‌పీ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కంట కాపల్లి – కొత్త వలస రైల్వేస్టేషన్‌ల మధ్య రైలు పట్టాలపై రెండు నెలల మగ పసికందు మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆదివారం గుర్తించారు.

బిడ్డ శరీరంపై లేత నీలిరంగు టీషర్ట్‌ ధరించి ఉంది. గుర్తు తెలియని రైల్లోంచి జారి పడిపోయిందా? లేక ఎవరైనా తెచ్చి పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జీఆర్‌పీ ఎస్‌ఐ రవివర్మ తెలిపారు. పసికందు ఆచూకీ తెలిసిన వారు విజయనగరం రైల్వే జీఆర్‌పీ పోలీసుల నుగానీ 9490617089, 9666555214 నంబర్లకు సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని  జిల్లా కేంద్రాస్పత్రి మార్చురీకి తరలించినట్టు తెలిపారు.  

రైలు పట్టాలపై  గుర్తు తెలియని పసికందు మృతదేహం  

మరిన్ని వార్తలు