అయోధ్య భూమి పూజ.. ముస్లింకు తొలి ఆహ్వానం 

3 Aug, 2020 17:32 IST|Sakshi

లక్నో: అయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో మతసామరస్యం వెల్లివిరిసే చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు. అయోధ్య భూమిపూజకు సంబంధించిన తొలి ఆహ్వానాన్ని అధికారులు ఓ ముస్లింకు అందించారు. అది కూడా అయోధ్యలోని వివాదాస్పద స్థలం ముస్లింలకే దక్కాలని పోరాడిన ఇక్బాల్ అన్సారీకి. (అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం..)

ఈ ఆహ్వానంపై అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందడం ఆ శ్రీరాముడి కోరిక అనుకుంటాను. దీన్ని మనసారా స్వీకరిస్తున్నాను. ఆలయం నిర్మాణం పూర్తయతే.. అయోధ్య చరిత్ర కూడా మారుతుంది. ఎంతో అందంగా తయారవుతుంది. భవిష్యత్తులో  ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. కాబట్టి స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అన్నారు. అయోధ్య ప్రజలు గంగా-జముని నాగరికతను అనుసరిస్తున్నారని, ఎవరిలోనూ చెడు భావన లేదని తెలిపాడు అన్సారీ‌. ‘ఈ ప్రపంచం నమ్మకం మీదనే నడుస్తోంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిస్తే.. వస్తాను అని నేను ముందే చెప్పాను. అయోధ్యలో ప్రతి మతానికి, వర్గానికి చెందిన దేవతలు ఉన్నారు. ఇది సాధువుల భూమి. రామ మందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నాడు అన్సారీ. (150 నదుల జలాలతో అయోధ్యకు..)

భూమిపూజకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అడ్వాణీతోపాటు పలువురు నేతలకు కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వల్ల రద్దీకి చోటు లేకుండా కేవలం 180 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.  

మరిన్ని వార్తలు