జార్ఖండ్ సీఎం జాడ తెలియడం లేదంటున్న అధికారులు
న్యూఢిల్లీ/రాంచీ: భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని అధికారులు చెప్పారు.
జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికే దాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు.