ఫిర్యాదు చేసేందుకు వచ్చి....ఏకంగా పోలీస్‌ అధికారి సీటులో కూర్చొని....

1 Nov, 2022 19:36 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారి కుర్చిలో కూర్చొన్న వీడియో  సోషల్‌ మాధ్యమంలో తెగ వైరల్‌ అయ్యింది. దీంతో సీరియస్‌ అయిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు వ్యక్తి బిల్డర్‌ సురేష్‌ పాండురంగ పాటిల్‌ అలియాస్‌ చౌదరి అని, మాన్‌పాడ పోలీస్‌ స్టేషన్‌కి ఫిర్యాదు చేయడానికి వచ్చి ఈ వీడియోని షూట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో రాణి నహీం హై తో క్యా హుమా యే బాద్షా ఆజ్‌ భీ లకోన్‌ దిలోన్‌ పే రాజ్‌ కర్తా హై (నాకు రాణి లేకపోయినప్పటికీ లక్షల హృదయాలను పాలిస్తున్నాడు) అనే డైలాగ్‌ వస్తుంది.

అంతేగాదు సదరు వ్యక్తి తన స్నేహితులతో కలిసి  తుపాకీ ఊపుతూ ఫోజ్‌ పెట్టిన మరో వీడియోని కూడా జోడించి మరీ పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏ పోలీస్టేషన్‌లో షూట్‌ చేశాడో అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వోద్యోగిగా నటించడం, ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి నేరాలకు గాను కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...బిల్డర్‌ సురేష్‌ మాన్‌పాడ పోలీస్‌ స్టేషన్‌లో నరబలి, మూఢనమ‍్మకాలకు పేరుతో ఓ వ్యక్తి చేతిలో రూ. 19 లక్షలు పొగొట్టుకున్నానంటూ ఫిర్యాదు చేశాడు.

ఆ తదనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆ డబ్బులు వసూలు చేసుకునేందుకు పోలీస్టేషన్‌కి వచ్చినప్పుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వివిధ పోలీస్టేషన్‌లో అతనిపై ఏడు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, అలాగే అతని వద్ద నుంచి లైసెన్సు తుపాకిని, మెర్సిడేజ్‌ కారు, కొడవలి, ఐదు లైవ్‌ కాట్రిడ్జిలు స్వాధీనం చేసుకున్నారు.

(చదవండి: దాగుడుమూతలు ఆడుతూ.. లిఫ్ట్ కిటికిలో తల పెట్టి...)

మరిన్ని వార్తలు