14 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ డ్రామా.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

17 Oct, 2022 13:19 IST|Sakshi

ముంబై: చదువుకోమని తల్లి మందలించటంతో ఓ 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నాగ్‌పూర్‌ నుంచి పక్క జిల్లా చంద్రాపూర్‌కు వెళ్లిన బాలిక తాను కిడ్నాప్‌కు గురయ్యానని ఓ కట్టుకథ అల్లింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. కేసు వివరాలను ఆదివారం   వెల్లడించారు పోలీసులు. 

పోలీసుల వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌ జిల్లాలోని నందన్‌వన్‌ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. బస్సులో 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్‌కు సాయంత్రానికి చేరుకుంది. తమ కూతురు కనిపించకపోవటంతో ఆమె కోసం వెతకటం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. ఆచూకీ లభించకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. మరోవైపు.. చంద్రాపూర్‌ చేరుకున్న బాలిక నేరుగా రామ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్‌ చేసి కారులో చంద్రాపూర్‌కు తీసుకొచ్చినట్లు చెప్పింది. వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు కట్టుకథ అల్లింది. 

బాలిక తెలిపిన వివరాలతో నాగ్‌పూర్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు చంద్రాపూర్‌ పోలీసులు. ఆ తర్వాత వారికి అప్పగించారు. నాగ్‌పూర్‌లోని నందన్‌వన్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. బాలిక తానే బస్సు ఎక్కి చంద్రాపూర్‌ వెళ్లినట్లు తేలింది. ఈ వీడియోను చూపించి ప్రశ్నించగా.. తన తల్లి చదువుకోవాలని మందలించటం వల్లే ఇలా చేశానని అంగీకరించింది.

ఇదీ చదవండి: ‘సూపర్‌ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్‌ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్‌

మరిన్ని వార్తలు