‘పుట్టుకతో ఎవరు జీనియస్‌లు కాలేరు’

26 Aug, 2020 16:47 IST|Sakshi

న్యూఢిల్లీ: గణితం అంటే కొందరు విద్యార్థులకు విపరీతమైన ఫోబియా ఉంటుంది. కానీ అలాంటి గణిత సబ్జెక్ట్‌ను 21ఏళ్ల నీలకంఠ భాను ప్రకాశ్‌ కాలిక్యులేటర్‌ లేకుండానే లెక్కలను సునాయసంగా సాధిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మైండ్‌ స్పోర్ట్స్‌ ఒలంపియాడ్‌లో జరిగిన మెంటల్‌ కాలిక్యులేషన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తరుపున తొలి స్వర్ణం సాధించాడు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రకాశ్‌, స్టీఫన్‌ కాలేజీలో చదువుతున్నాడు. కాగా ప్రకాశ్‌ తన లెక్కల ప్రతిభతో ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా నాలుగు ప్రపంచ రికార్డులు, 50లిమ్కా రికార్డులు ప్రకాశ​ సాధించాడు.

తన విజయంపై ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్‌ స్పందిస్తూ.. తాను పుట్టుకతో జీనియస్‌ను కాదని, పుట్టుకతో ప్రతి మనిషికి గణిత తెలివితేటలు ఉంటాయని అన్నారు. గణితంలో రికార్డులు బద్దలు కొడుతున్న ప్రకాశ్‌ది హైదరాబాద్‌ కావడం విశేషం.తానే కాదు ఎవరు పుట్టుకతో జీనియస్‌లు కాలేరని అభిప్రాయపడ్డారు. తాను ఇన్ని అరుదైన రికార్డులు సాధించడానికి 15ఏళ్లు కష్టపడ్డానని తెలిపారు. కానీ దేశంలోని విద్యార్థులకు గణిత సబ్జెక్ట్‌ను సునాయసంగా అర్థమయ్యే గణిత ల్యాబ్స్‌ను ప్రవేశపెడతానని తెలిపారు. గణిత ల్యాబ్స్‌ ద్వారా విద్యార్థులకు సబ్జెక్ట్‌ సునాయసంగా అర్థమవ్వడమే కాకుండా గణితంపై ఇష్టం కలిగి మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు.

భారత దేశాన్ని గణితంలో అన్ని దేశాల కంటే ముందుంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఫిట్‌నెస్‌లో ఉస్సేన్‌ బోల్ట్‌ ప్రపంచానికి ఎలా స్పూర్తి కలిగించాడో, మానసిక నైపుణ్యాలు, మానవ మెదడు సామర్థ్యం తెలుసుకోవడానికి ప్రేరణ కలిగిస్తాయని నీలకంఠ భాను ప్రకాశ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు