శివసేన ముఖ్య అధికార ప్రతినిధిగా సంజయ్‌ రౌత్‌

8 Sep, 2020 19:57 IST|Sakshi

బాలీవుడ్‌ క్వీన్‌తో వివాదం

ముంబై : బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌తో వివాదానికి కేంద్ర బిందువైన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఆ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. సంజయ్‌ రౌత్‌ను పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా శివసేన నియమించింది. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పోల్చిన కంగనా రనౌత్‌పై సంజయ్‌ రౌత్‌ కొద్దిరోజులుగా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముంబైని పీఓకేతో పోల్చిన కంగనాను నగరంలో అడుగుపెట్టవద్దని సేన నేత పరోక్షంగా హెచ్చరించారు. కాగా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది.

ఇక కంగనాపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపసంహరించుకునేందుకు ఆయన సుముఖత చూపకున్నా తాను ఎంచుకున్న పదాలు మరింత మెరుగ్గా ఉంటే బావుండేదని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు.మరోవైపు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా ఈనెల 9న ముంబైకు రానుండటంతో ఆమెకు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కంగనాకు వై సెక్యూరిటీ కల్పించడంతో మనాలీలోని ఆమె నివాసం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులను నియమించారు. ముంబై పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐబీ, సీఆర్‌పీఎఫ్ అధికారులు ఆమె నివాసానికి చేరుకున్నారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్‌ కేసు’

మరిన్ని వార్తలు