2024 కల్లా అమెరికాకు దీటుగా ఉత్తర్‌ప్రదేశ్‌ రోడ్లు.. గడ్కరీ హామీ

9 Oct, 2022 15:01 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామన‍్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. లఖ్‌నవూలో జరిగిన ‘ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌’ 81వ సదస్సులో రోడ్ల నిర్మాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.8,000 కోట్లు విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ రహదారులను అగ్రరాజ్యానికి దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.5 లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు నితిన్‌ గడ్కరీ. ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభలో మాట్లాడుతూ భారత్‌లోని రోడ్ల మౌలిక సదుపాయాలు త్వరలోనే అమెరికా తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ‘షాహబాద్‌-హర్దోర్‌ బైపాస్‌, షాజహాన్‌పుర్‌ టూ షాహబాద్‌ బైపాస్‌, మోరాబాద్‌- థాకుర్వారా-కషిపుర్‌ బైపాస్‌, ఘాజిపుర్‌-బలియా బైపాస్‌లతో పాటు 13 ఆర్‌వోబీలు, మొత్తం రూ.8వేల కోట్లు ప్రాజెక్టులు ఆమోదం పొందాయి.  సాంకేతికత, పర్యావరణ పరిక్షణ, వినూత్నత, భద్రత, నాణ్యత.. వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి జరగాలి.’ అని గడ్కరీ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌తో కాకుండా సీఎన్‌జీ, ఇథనాల్‌, మిథనాల్‌తో నడిచే వాహనాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు గడ్కరీ. విద్యుత్తు వాహనాలను వినియోగించాలన్నారు. ఫలితంగా రవాణ వ్యయాలు తగ్గుతాయన్నారు. మరోవైపు.. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు గడ్కరీ. యూపీలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాహుల్‌ అంటే భారత్‌.. భారత్‌ అంటే రాహుల్‌: యూపీ కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు