North East Express Train Accident: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

12 Oct, 2023 07:35 IST|Sakshi

పాట్నా: ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా బీహార్‌లో మరో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అసోంలోని కామాఖ్యాకు వెళ్తోన్న నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్‌పుర్‌ స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

వివరాల ప్రకారం.. నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్‌పుర్‌ స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పాయి. బుధవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా 21 బోగీలు పట్టాలు తప్పాయని, మూడు బోగీలు పల్టీలు కొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందగా.. 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్తానిక ఆసుపత్రులకు తరలించారు. 

రైలు ప్రమాదంపై బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌కు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్‌ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించామని, క్షతగాత్రుల్ని పట్నాలోని ఎయిమ్స్‌కి తరలిస్తామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. రైలు ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. పాట్నా: 9771449971, ధన్‌పూర్‌: 8905697493, కమాండ్‌ కంట్రోల్‌: 7759070004, ఆరా : 8306182542 హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచింది.

మరిన్ని వార్తలు