అలా పైపైకి...

4 Jan, 2022 05:31 IST|Sakshi

శరవేగంగా పెరుగుతున్న కేసులు

వారం రోజుల్లో 500 శాతానికి పైగా పెరుగుదల

1,700కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు

న్యూఢిల్లీ: భయపడినట్లే జరుగుతోంది. దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. డిసెంబరు 28తో పోలిస్తే జనవరి 3 తేదీకల్లా (వారం రోజుల్లో) కేసుల్లో 500 శాతానికి పైగా పెరుగుదల నమోదు కావడంతో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి నెల మధ్యకు వచ్చేనాటికి ఒమిక్రాన్‌ కారణంగా భారత్‌లో థర్డ్‌వేవ్‌ పీక్‌కు చేరొచ్చనే అంచనాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

డిసెంబరు 28న 6,358 కేసులు నమోదుకాగా... సోమవారం (జనవరి 3న) ఏకంగా 33,750 కొత్త కేసులొచ్చాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1,700లకు చేరింది. వీరిలో 639 మంది కోలుకోవడమో, ఇతర ప్రదేశాలకు వెళ్లిపోవడమో జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. మహారాష్ట్ర (510), ఢిల్లీ (351)లు అత్యధిక ఒమిక్రాన్‌ కేసులున్న రాష్ట్రాలు. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 3.84 శాతంగా నమోదైంది.  

► దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 4,099 కేసులు వచ్చాయి. మే నెల తర్వాత ఇదే అత్యధికం. 6.46 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. జీనోమ్‌ స్వీక్సెనింగ్‌కు పంపిన శాంపిళ్లలో 81 శాతం ఒమిక్రాన్‌ కేసులొచ్చాయి.  
► ముంబైలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 7,298 కేసులొచ్చాయి. దాంతో ముంబైలో 1–9 తరగతులకు, ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు బడులు/కాలేజీలను జనవరి 31 దాకా మూసివేయాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు