ప్రతి జిల్లాలో పీజీ వైద్య కళాశాల

1 Oct, 2021 04:24 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వైద్య వ్యవస్థలో మార్పు కోసమే

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌  

జైపూర్‌:  పోస్టు–గ్రాడ్యుయేట్‌(పీజీ) వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల లేదా విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను అందించడం మధ్య అంతరం తగ్గుతోందని తెలిపారు. ఆయుర్వేదం, యోగాను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు.

దేశంలో గత ఆరేళ్లలో 170కిపైగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయని, కొత్తగా మరో 100 కాలేజీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్‌లో నాలుగు నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ టెక్నాలజీ’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైద్య వ్యవస్థను సమూలంగా మార్చడానికే ఎంసీఐ స్థానంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ను తీసుకొచి్చనట్లు ఉద్ఘాటించారు. ఈ కమిషన్‌తో ఇప్పటికే సానుకూల ఫలితాలు వస్తున్నాయని వివరించారు.

దేశంలో సంప్రదాయ, ఆధునిక వైద్యం నడుమ అంతరం ఉందని, దీన్ని తొలగించాలి్సన అవసరం ఉందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే కొత్తగా నేషనల్‌ హెల్త్‌ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. ఎయిమ్స్‌ లేదా మెడికల్‌ కాలేజీలు.. వాటి నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అన్ని మూలలకూ విస్తరింపజేయాలని సూచించారు. దేశంలో గతంలో కేవలం 6 ఎయిమ్స్‌లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 22కుపైగానే ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో కేవలం 82,000 అండర్‌–గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.40 కోట్లకు చేరిందని వెల్లడించారు. చాలా మంది విద్యార్థులకు ఆంగ్ల భాష పెద్ద అవరోధంగా మారిందని, నూతన విద్యా విధానంలో భాగంగా భారతీయ భాషల్లోనూ వైద్య విద్యను అభ్యసించే వెలుసుబాటు లభిస్తోందని తెలిపారు. 

మరిన్ని వార్తలు