Pakistan Girl-Indian Man Love Story: పాక్ యువతితో ప్రేమ.. భారత్‌లో అడుగుపెట్టిన జావెరియా

6 Dec, 2023 09:05 IST|Sakshi

ఢిల్లీ: ఇటీవల కొన్ని ప్రేమలు దేశాలు దాటుతున్నాయి. ఒక దేశానికి చెందిన యువతి/యువకుడు.. మరో దేశానికి చెందిన వారితో ప్రేమలో పడటంతో వారు అక్కడికి వెళ్లడం పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. తన తల్లి మొబైల్‌లో ఉన్న ఓ యువతి ఫోటోను చూసి మనసు పడ్డ ఓ యువకుడి లవ్‌స్టోరీ ఇది. వీరి ప్రేమకథ 2018లో మొదలైంది. ఇక్కడ అమ్మాయిది పాకిస్తాన్‌, అబ్బాయిది భారత్‌కు చెందిన కోల్‌కత్తా.. ఇంతకీ ఏం జరిగిందంటే..

వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ జర్మనీలో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్‌ ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. పెద్దలు అంగీకరించినా వీరి పెళ్లికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే, భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరియా ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. మధ్యలో కొవిడ్‌ కష్టాలు వచ్చిపడ్డాయి. మొత్తం అయిదేళ్లు అలా గడిచిపోయాయి. 

ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియాకు ఇపుడు భారత్‌ వీసా దక్కింది. అమృత్‌సర్‌ నుంచి కోల్‌కతాకు ఈ జంట విమానంలో చేరుకుంది. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక, మంగళవారం వాఘా - అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి అడుగుపెట్టిన పాక్‌ యువతికి బాజా భజంత్రీలతో యువకుడి కుటుంబం ఘనస్వాగతం పలికింది. వచ్చే జనవరిలో ఇరువురి వివాహం జరగనుంది.

>
మరిన్ని వార్తలు