అనిత గొంతు మిమిక్రీతో ప్రచారం

5 Apr, 2021 07:05 IST|Sakshi

ట్విట్టర్‌ వేదికగా తిట్లపురాణం 

తనకు సంబంధం లేదన్న మంత్రి 

సాక్షి, చెన్నై: మంత్రి పాండియరాజన్‌ ట్విట్టర్‌లో ఓ వీడియో వివాదానికి దారి తీసింది. నీట్‌కు వ్యతిరేకంగా బలవన్మరణానికి పాల్పడిన అనిత అన్నాడీఎంకేకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఆ వీడియో ఉండడం ఈ వివాదానికి కారణం. ఈ వ్యవహారంపై నెటిజన్లు తిట్ల పురాణం అందుకోవడంతో ఆ వీడియోతో తనకు సంబంధం లేదని మంత్రి దాటవేయడం గమనార్హం. నీట్‌కు వ్యతిరేకంగా గతంలో అనిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

మెరిట్‌ మార్కులు దక్కినా, నీట్‌ రూపంలో వైద్య సీటు దూరం కావడంతో రాష్ట్రంలో బలన్మరణానికి పాల్పడిన తొలి విద్యార్థిగా అనిత ఉన్నారు. ఆమె మరణంతో నీట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే సాగాయి. తాజా ఎన్నికల్లో నీట్‌కు వ్యతిరేకంగా ప్రతి పక్షాలు వ్యాఖ్యలు చేసే సమయంలో తప్పనిసరిగా అనిత పేరును స్మరించుకోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె గొంతుతో ఓట్లను దండుకునేందుకు చేసిన ఓ ప్రయత్నం అన్నాడీఎంకే ఆవడి అభ్యర్థి, మంత్రి పాండియరాజన్‌కు బెడిసికొట్టింది.  

మిమిక్రీతో.. 
అనిత నీట్‌కు వ్యతిరేకంగా గతంలో తీవ్రంగానే వ్యాఖ్యలు చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని ,అన్నాడీఎంకేకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేసినట్టుగా మిమిక్రీ చేసి ఓ వీడియోను సిద్ధం చేసినట్టున్నారు. ఇది మంత్రి అధికార ట్విట్టర్లో దర్శనం ఇచ్చింది. అన్నాడీఎంకేకు అనుకూలంగా అనిత వ్యాఖ్యలు ఎప్పుడు చేసినట్టో అని, నెటిజన్లు తీవ్రంగానే విరుచుకు పడే పనిలో పడ్డారు. ఇదేం నీచ రాజకీయం అని తిట్ల పురాణం అందుకున్న వాళ్లూ ఉన్నారు. దీంతో మేల్కొన్న మంత్రి పాండియరాజన్‌ తన వ్యాఖ్యలతో ఓ వీడియో విడుదల చేశారు.

ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, తన అను మతి లేకుండా ట్విట్టర్లోకి వచ్చినట్టు స్పందించడం గమనార్హం. అయితే, అనిత సోదరుడు మణిరత్నం ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించాడు. తన చెల్లెల్ని నీట్‌రూపంలో పొట్టన పెట్టుకుంది కాకుండా, ఇప్పుడు ఆమె గొంతును మిమిక్రీ చేసి ఓట్లు దండుకునే యత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఈ వీడియో అనితను కించ పరిచనట్టుగానే ఉందని, ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
చదవండి: 3 రాష్ట్రాలు, ఒక యూటీలో ముగిసిన ఎన్నికల ప్రచారం

>
మరిన్ని వార్తలు