చైనాతో బంధంపై ‘సరిహద్దు’ ప్రభావం

18 Oct, 2020 06:12 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌–చైనా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, ఈ పరిస్థితులు రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. తను రాసిన ‘ది ఇండియా వే’పై జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. భారత్‌–చైనా సరిహద్దు సమస్య చాలా కష్టమైందీ, క్లిష్టమైంది అంటూ ఆయన.. గత మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను చారిత్రక కోణంలో ఆవిష్కరించారు.

వాణిజ్యం, పర్యాటకం, ఇతర కార్యక్రమాల ద్వారా 1980ల నుంచి ఈ సంబంధాలు క్రమంగా మెరుగుపడుతూ వచ్చాయన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణానికి భంగం కలిగితే ఆ ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలపైనా ఉంటుందని, ఏం జరుగనుందో చూడాలని అన్నారు. అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్న భారత్, చైనాలు..తమ మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధిస్తాయనేదే పెద్దప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్‌కు ముందే రాశాననీ, అప్పటికి తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు మొదలుకాలేదని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు