తెలంగాణలో 39 అమృత్‌ భారత్‌ స్టేషన్లు.. రైల్వే స్టేషన్లకు కొత్తరూపు

2 Aug, 2023 01:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమృత్‌ భారత్‌ స్టేషన్ల పథకంలో భాగంగా తెలంగాణలోని మొత్తం 39 రైల్వే స్టేషన్లను గుర్తించి వీటిని సంపూర్ణంగా ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి విడతగా 21 స్టేషన్లకు సంబంధించిన పనులను ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ‘అమృత్‌ భారత్‌ స్టేషన్ల’పథకంలో భాగంగా.. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు స్టేషన్‌ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణి కులకు వెయిటింగ్‌ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై–ఫై సదుపాయాన్ని కల్పిస్తారు.

అదేవిధంగా స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రాడక్ట్‌’దుకాణాలు, ప్రయాణీకులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకంతో పాటు చిన్న గార్డెన్లు కూడా నెలకొల్పుతారు. ఇక స్టేషన్ల అవసరాలకు అనుగుణంగా బిజినెస్‌ మీటింగ్స్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు.

వీటికి తోడుగా నగరానికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్‌ బాటలు, రూఫ్‌ ప్లాజాలు (అవసరాన్ని బట్టి), దీర్ఘకాలంలో అవసరమయ్యే నిర్మాణాలను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు. కాగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేవిధంగా అభివృద్ధి చేసేందుకు రూ.715 కోట్లు, చర్లపల్లి టరి్మనల్‌ అభివృద్ధికి రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. 

తెలంగాణలో మొత్తం గుర్తించిన స్టేషన్లు 39:  
ఆదిలాబాద్, బాసర్, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్‌పేట్, హైటెక్‌ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌ (నాంపల్లి), జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ, తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్‌. 
∙మొదటి విడతలో ఆగస్టు 6న పనులు ప్రారంభం కానున్న 21 స్టేషన్లపై రూ.894 కోట్లు ఖర్చుచేయనున్నారు.   

మరిన్ని వార్తలు