రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ

24 Oct, 2022 06:01 IST|Sakshi

డెహ్రాడూన్‌: సముద్ర మట్టానికి 11,300 అడుగుల ఎత్తున రేకుల పైకప్పుతో నిర్మించిన తాత్కాలిక గదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి పూట నిద్రించారు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) కార్మికుల కోసం వండిన కిచిడీని ఆరగించారు. శనివారం ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఈ విశేషాలు చోటుచేసుకున్నాయి. మనా పట్టణ సమీపంలో బీఆర్‌ఓ డిటాచ్‌మెంట్‌ సెంటర్‌ను మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే.

ఓ కార్మికుడు సిద్ధం చేసిన కిచిడీ, మాండ్వీ కీ రోటీ, స్థానిక పచ్చడి, జాగోర్‌ కీ ఖీర్‌ను ఆహారంగా తీసుకున్నారని అధికారులు చెప్పారు. అంతేకాకుండా రేకుల పైకప్పుతో అప్పటికప్పుడు నిర్మించిన తాత్కాలిక నిర్మాణంలో సేదతీరారని వెల్లడించారు. ఈ గదిలో చిన్నపాటి ఎలక్ట్రిక్‌ హీటర్‌ మాత్రం ఉంది. రోడ్ల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కూలీలతో మోదీ సంభాషించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ బీఆర్‌ఓ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. శ్రమయేవ సర్వం సాధ్యం (శ్రమతో ఏదైనా సాధ్యమే) అని విజిటర్స్‌ బుక్‌లో రాశారు.

మరిన్ని వార్తలు